- పాడేరు నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా: ఆధునిక యుగంలో అంతరిక్షంలో కి తమ స్వంత పరిజ్ఞానం తో దిగ్విజయంగా రాకెట్ లు పంపుతున్న తరుణంలో విశాఖ మన్యం లో మాత్రం గిరిజనుల కు కనీస రవాణా సౌకర్యాలు కల్పించలేక పోవడం విచారకరం. స్వాతంత్ర్యం సిద్దించి 70 ఏళ్ళు గడిచినా నేటికి విశాఖ మన్యం లోని వెయ్యి కి పైగా గ్రామాలకు సరైన రహదారి సౌకర్యాలు లేవంటే అతిశయోక్తి కాదు. మన్యంలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట,డుంబ్రిగూడ, అరకులోయ,అనంతగిరి మండలాలు ఉన్నాయి. ఆయా మండలాలకు సంబంధించి 244 పంచాయితీలు, సుమారు 3, 450 గ్రామాలున్నాయి. వీటిలో పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, కొయ్యూరు, గూడెం కొత్త వీధి, అనంతగిరి, హుకుంపేట మండలాల్లోని అతి మారుమూల గ్రామాలకు నేటికి సరైన రహదారి సౌకర్యాలు లేవు. పాడేరు, గూడెం కొత్త వీధి, అరుకులోయ తదితర మండలాల్లో రోడ్లు నిర్మాణానికి అటవీ శాఖ ఆంక్షలు విధించింది. దీంతో ఆయా మండలాల్లో నుంచి గిరి గ్రామాలకు దశాబ్దాలుగా కలగానే మిగిలిపోయింది. అటవీ ఆంక్షలను తొలగించి రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని పాలకులు, అధికారులు చెబుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. ఇందుకు పాడేరు మండలం కించూరు రహదారి నే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పాడేరు మండలంలో అతి మారుమూలన ఉన్న కించూరు గ్రామానికి నేటికి సరైన రహదారి సౌకర్యం లేదు. ఈ రహదారి పనులకు అటవీశాఖ ఆంక్షలు విధించింది. దీంతో ఈ పంచాయతీ ప్రజలకు దశాబ్దాల కాలంగా కాలి నడకే శరణ్యం. మరికొన్ని గ్రామాలకు మట్టి, మెంటల్ రోడ్డు లను నిర్మించినా రవాణా సదుపాయాలు కల్పించలేదు. పాడేరు, అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి, జి.మాడుగుల, చింతపల్లి, గూడెం కొత్త వీధి, కొయ్యూరు, హుకుంపేట మండలాల్లో చాలా గ్రామాలకు రహదారి సౌకర్యాలు ఉన్నా బస్సు సౌకర్యం కల్పించలేదు. దీంతో పాటు జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి మండలాల్లోని పారుతున్న గెడ్డలపై వంతెనలు నిర్మించుకోవడం తో ఇప్పటికీ గిరిజనులు ప్రమాదకరమైన వాగులు, వంకలు దాటి వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో వాగులు, గెడ్డలు పొంగి ఏటా పదుల సంఖ్యలో గిరిజనులు మృత్యు వాత పడుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణాలు చేపట్టి రవాణా సదుపాయాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.
[zombify_post]
