ఆగి ఉన్న లారీని క్వాలిస్ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు మరణించగా, ఏడుగురు పరిస్థితి విషమంగా మారిన సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామ శివారులో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణంలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులు, కరీంనగర్ పట్టణంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలలో సెకండ్ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వెళ్లి తిరిగి సిద్దిపేటకు వస్తున్న క్రమంలో చిన్నకోడూరు మండలం అనంత సాగర్ గ్రామ శివారులో, ఆగి ఉన్న లారీని వీరి వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ విపిన్, గ్రీష్మ, నాగరాజ్ లు అక్కడికక్కడే మరణించగా దేవిచంద్, నితిన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, సాయిచంద్, నర్మద తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు తరలించడం జరిగిందని వైద్య సిబ్బంది తెలిపారు.
పరీక్ష సెంటర్ స్థానికంగానే ఉండాలి
ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు వారు చదువుతున్న పట్టణములోనే పరీక్ష సెంటర్ ఉండాల్సింది. ఈ విషయమై అధికారులకు వినతి పత్రం అందించిన స్పందన కరువైందని పలువురు విద్యార్థులు వాపోయారు.

స్థానికంగా పరీక్ష సెంటర్ ఉంటే మా పిల్లలు బతికేవారు
స్థానికంగా పరీక్ష సెంటర్ ఉంటే మా పిల్లల ప్రాణాలు మిగిలేవని ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన పిల్లలు మధ్యలోనే మమ్మల్ని విడిచి పెట్టి పోయారని ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల తల్లి దండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం స్థానికులను కలిచివేసింది…. వారి ఆర్తనాదాలు ఇప్పటికైనా అధికారులు వింటారో లేదో చూడాలి…
[zombify_post]