విశాఖపట్నం: ప్రభుత్వ నిధుల్ని షెల్ కంపెనీలకు మళ్లించి మోసాలకు పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి డిమాండ్ చేశారు. చంద్రబాబును సీఐడీ పోలీసులు శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ.371కోట్ల ఖజానా సొమ్మును దారి మళ్లించిన చంద్రబాబు అప్పటి కేబినెట్ను కూడా దారి తప్పించి స్కిల్ డెవలెప్మెంట్ పేరిట మోసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నో దర్యాప్తు సంస్థలు ఈ కుంభకోణంపై విచారణ చేపట్టాయని, దోచేసిన సొమ్మును తొలుత విదేశాలకు ఆ తర్వాత స్వదేశానికి తీసుకొచ్చారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో అధికారం చేపట్టిన రెండు నెలలకే చంద్రబాబు ఈ అవినీతికి తెరతీశారని, రూ.3, 356కోట్లతో ప్రాజెక్టు అంటూ ప్రభుత్వ వాటాగా 10శాతం, 90శాతం సీమెన్స్ సంస్థ పెట్టుకుందని, సుమారు రూ.3వేల కోట్లు సీమెన్స్ ఇస్తుందని నమ్మబలికారన్నారు. అందర్నీ తప్పుదోవ పట్టిస్తూ, ఆపై కేబినెట్కు నోట్ పెట్టడం నిబంధనలకు విరుద్ధమన్నారు. జీవోలో ఉన్నది, ఒప్పందంలో లేకుండా సంతకాలు చేసేశారని, సీమెన్స్ నుంచి ఒక్క రూపాయి కూడా రాకుండానే ఐదు దఫాలుగా చంద్రబాబు ప్రభుత్వం రూ.371కోట్లు చెల్లించేసిందని ఆరోపించారు. మూడు సార్లు ముఖ్యమంత్రినని, 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిననీ చెప్పుకొంటున్న చంద్రబాబు ఇలాంటి మోసాలకు పాల్పడడం దారుణం అని మేయర్ మండిపడ్డారు. సమావేశంలో వైసీపీ సీనియర్ నేత గొలగాని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
[zombify_post]