Women Reservation bill: తెలంగాణం, (సెప్టెంబర్ – 18) : ఐదు రోజులపాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు రాత్రి 6:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.

రెండు గంటలపాటు సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించనున్నారు. మంగళవారం కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభం కాబోయే సమావేశాలలో తొలి బిల్లుగా ఈ మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు.
దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ బిల్ పెండింగ్ లోనే ఉంది. 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది. అది ఎప్పటికీ లాప్ కాలేదు. దీంతో లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడమే మిగిలింది. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఈ బిల్లుకి కేంద్రం ఆమోదముద్ర వేయనుంది.