-
కాంగ్రెస్ గూటికి.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ మందుల..
-
తుంగతుర్తి:
వచ్చే ఎన్నికలలో ఎలాగైనా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ మందుల సామేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం హైదరాబాద్లో టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేసిన ఆయన సుమారు రెండు దశాబ్దాలు తుంగతుర్తి నియోజకవర్గంలో ఉద్యమ వ్యాప్తికి, పార్టీ పటిష్టతకు కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 2014లో తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభిస్తుందని ఆశించగా అనూహ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడైన గాదరి కిశోర్కుమార్ టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. సామేల్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని నాడు తిరుమలగిరిలో నిర్వహించిన ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. నాటి నుంచి సామేల్ అసంతృప్తితోనే ఉంటున్నారు. రెండు పర్యాయాలు రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్గా అవకాశం ఇచ్చారు. 2018లోనూ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పుడూ సిట్టింగ్లకే టికెట్ ఇవ్వడంతో 2018లోనూ కిశోర్కుమారే టికెట్ సాధించి విజయం సాధించారు. ఈ సారైనా తనకు టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తుండగా, గత జూన్ 29న తిరుమలగిరిలో జరిగిన నియోజకవర్గ ప్రగతి నివేదన సభలో ఈ సారి టికెట్ కిశోర్కుమార్కే అని, భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో అప్పటికే అసంతృప్తితో ఉన్న సామేల్ మంత్రి కేటీఆర్ ప్రకటనతో కలత చెంది గత జూన్ 30న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయనను తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ ఆహ్వానించాయి. ఎందులో చేరాలి, ఎందులో చేరితే టికెట్ వస్తుంది, గెలుపు ఎలా ఉంటుదన్నది తేల్చుకోలేక రెండున్నర నెలలుగా ఆలోచించి ఆయన చివరికి కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి తుంగతుర్తి టికెట్ కోసం ఇప్పటికే 23 మంది నాయకులు పోటీ పడుతున్నారు. ఈనేపథ్యంలో సామేల్కు కాంగ్రెస్ టికెట్ లభిస్తుందా? ఆయన భవితవ్యం ఏమిటనేది వేచిచూడాల్సిందే.

[zombify_post]